22-06-2025 12:00:00 AM
ఆదిలాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): విశ్వాసమున్న జంతువులు అనగానే ముందు గా గుర్తుకొచ్చేది శునకాలు (జాగిలం). విశ్వాసంతో పాటు వీటికి నేరస్తులను పసిగట్టే లక్షణమూ ఉంటుంది. అందుకే పోలీసులు నేర పరిశోధనలో వీటిని వాడుతారు. పోలీస్ శాఖలో ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ విభాగం ఉంటుంది. వీటినే పోలీస్ జాగిలాలు అని పిలుస్తారు.
అయితే ఆదిలాబాద్ జిల్లా పోలీస్శాఖకు సంబంధించిన డాగ్స్వాడ్లో పనిచే స్తున్న జాగిలాల కోసం రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఈత కొలను (స్విమ్మింగ్పూల్)ను నిర్మించారు. నేర పరిశోధనలో పోలీసులకు చేదోడువాదోడుగా ఉండే ఈ జాగిలాలకు వ్యాయామంతో పాటు ఉత్సా హం కోసం ప్రత్యేకంగా ఈ స్విమ్మింగ్పూల్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన ఈ ఈత కొలనును ఇటీవల ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు.
ఆదిలాబాద్ జిల్లా పోలీస్శాఖ డాగ్ స్క్వాడ్లో ఎనిమిది జాగిలాలున్నాయి. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలను కనుక్కోవటంలో కీలకపాత్ర పోషిస్తూ పోలీస్ శాఖకు సేవలందిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ప్రముఖుల పర్యటనల సందర్భంగా జగిలాల సేవలను వినియోగిస్తున్నారు. అయితే ఈ ఎనిమిది జాగిలాల్లో ఐదు జాగిలాలు పేలుడు పదార్థాలను కనుగొనేలా, రెండు జాగిలాలు నేరస్తులను పట్టుకొనేలా శిక్షణ పొందాయి. మరో జాగిలం మాదకద్రవ్యాలను గుర్తిస్తుంది. ఇలా పోలీస్ శాఖకు చేదోడువాదోడుగా నిలుస్తోన్న జాగిలాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్పీ అఖిల్ మహజన్ వీటికోసం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ప్రత్యేకంగా ఈత కొలను ఏర్పాటు చేయించారు. ఇది పోలీసు జాగిలాల కోసం రాష్ట్రంలోనే ఏర్పాటు చేసిన తొలి ఈత కొలను. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వీటి ఆరోగ్యం కోసం దీన్నిఏర్పాటు చేశారు.
ఆరోగ్యంతో పాటు వ్యాయామం..
జాగిలాలకు వేసవిలో ఉపశమనం కల్పించడమే కాకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ఈత కొలను ఉపయోగపడుతుందని డాగ్ స్వ్కాడ్ సిబ్బంది చెబుతున్నారు. వీటికి ఈతలోనూ ప్రత్యేకంగా శిక్షణనిచ్చినట్టు తెలిపారు. ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకొని తక్కువ సమయంలోనే వీటి కోసం ప్రత్యేకంగా ఈతకొలనును ఏర్పాటు చేయించారని చెప్పారు. ఏదిఏమైనప్పటికీ జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో శునకాల కోసం ప్రత్యేకంగా ఈతకొలను ఏర్పాటు చేయడం విశేషం.