calender_icon.png 2 December, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

02-12-2025 01:44:00 PM

15 మంది విద్యార్థులకు అస్వస్థత.

గద్వాల, (విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్(ST hostel students) జరిగింది.ఉదయం టిఫిన్ లో ఉప్మా లో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.పురుగులు పడిన ఉప్మా తిన్న తర్వాత హాస్టల్ నుండి పాఠశాల వెళ్లిన విద్యార్థులు ప్రేయర్ చేస్తుండగా కొందరు, క్లాస్ రూమ్ లో మరి కొందరు కళ్ళు తిరిగి కింద పడిపోవటంతో హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. మొత్తం 17 మంది విద్యార్థులలో 15 మంది విద్యార్థులు సెలైన్ బాటిల్ ఎక్కించి ప్రధమ చికిత్స అందిస్తుండగా మరో ఇద్దరు విద్యార్థులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యురాలు డాక్టర్ హేమలత తెలిపారు. జిల్లాలో ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్య బారిన పడిన సంఘటనలు నెలకొన్నాయి. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ లో 17 మంది విద్యార్థులు పురుగులు పడిన ఉప్మా తిని అనారోగ్య భారిన పడడంతో హుటాహుటిన సమీపంలోని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. హాస్టల్లో విద్యార్థుల మెనూ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, హాస్టల్ వార్డెన్, వంట మాస్టర్ అప్రమత్తంగా ఉండి ఉప్మా రవ్వను పరిశీలించినట్లయితే ఈ సమస్య తలెత్తేదికాదని అన్నారు.

విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడింది: డాక్టర్లు 

జిల్లా ఆస్పత్రిలో మీ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న విద్యార్థులు ప్రాథమిక చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు. టిఫిన్ లో పురుగులు రావడంతో ప్రత్యామ్నాయంగా బిస్కెట్, అరటిపండు ఇవ్వడంతో కొందరు విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోయారని తెలిపారు. అస్వస్థకు గురైన విద్యార్థులను మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత హాస్పిటల్ ను సందర్శించి పరామర్శించారు.