18-02-2026 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి పరిసర ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్రమోహన్ నేతృత్వంలో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ తనిఖీల్లో వీసా గడువు ముగిసినా, అక్రమంగా నగరంలో నివసిస్తున్న 23 మంది విదేశీయులను అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీగా అక్రమ వస్తువులను స్వాధీ నం చేసుకున్నారు. టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీ గేట్ నం. 1 నుంచి 4, ఐఏఎస్ కాలనీ, హకీంపేట కుంట ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 250 మంది పోలీ సు సిబ్బందితో కూడిన భారీ బందం ఈ ఆపరేషన్లో పాల్గొంది.
ఈ ఆపరేషన్లో ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారుల సహాయంతో విదేశీయుల పాస్పోర్టులు, వీసాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. నివాస ప్రాంతాల్లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందాను కూడా పోలీసులు రట్టు చేశారు.
ఈ క్రమంలో 9 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు అనుమతి లేకుండా నిల్వ ఉం చిన 53 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. నగరంలో శాంతిభద్రతలకు విఘా తం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని డీసీపీ చంద్రమోహన్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో స్థానిక ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.