కుర్వాపల్లి ఇటుక బట్టిల్లో అక్రమంగా నిల్వ చేసిన అటవీ కలప
అశ్వాపురం, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): అశ్వాపురం మండల పరిధిలోని కుర్వాపల్లి కొత్తూరు, తుమ్మల చెరువు ప్రాంతాలలో అనధికారంగా వెలసిన ఇటుక బట్టీల్లో భారీగా అటవీ కలప నిల్వ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటుక బట్టీల నిర్వహణకు మద్దతుగా ఓ అటవీ శాఖ అధికారి, ఆయన వద్ద పనిచేస్తున్న ఒక ప్రైవేట్ వ్యక్తి కలిసి వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారంలో అటవీ కలప దందాను ఒక గుంపు మేస్త్రీలు నిర్వహిస్తున్నారని, వారి కార్యకలాపాలు అశ్వాపురం మండలంలోని కుర్వాపల్లి కొత్తూరు ప్రాంతం కేంద్రంగా సాగుతున్నాయని సమాచారం.
ఇటుక బట్టీలకు అవసరమైన ఇంధనంగా అటవీ సంపదను అక్రమంగా నరికించి వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపదను ఈ విధంగా నాశనం చేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అక్రమ ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరుతున్నారు.






