పాలమూరు పచ్చగానే ఉంది.. ఇప్పుడు వలసలు లేవు
హైదరాబాద్,(విజయక్రాంతి): పరిశ్రమల కోసం లగచర్లలో ఎప్పుడో భూములు గుర్తించామని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. లగచర్లలో కొత్తగా భూములు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం పాలమూరు పచ్చగానే ఉందని.. ఇప్పుడు వలసలు లేవని వెల్లడించారు. పాలమూరు ప్రజలు మళ్లీ వలసపోయే పరిస్థతి తేవొద్దని ఆయన కోరారు. కేసీఆర్ ఇచ్చినట్లు ఎకరాకు రూ.10 వేల రైతుబంధు ఇవ్వడం చేతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రూ.35 వేల కోట్ల బోనస్ రైతులకు ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో ఎన్ కౌంటర్లు అనేవే లేవు, మళ్లీ ఎందుకు పునరుద్ధరించారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుతున్న సీఎం రేవంత్.. మీ కుటుంబ సభ్యుల ఆగడాలకు సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో కొద్ది రోజుల క్రితం మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుని మరణించిన సందర్భంలో విధించిన ఆంక్షలు ప్రజలు మరిచిపోలేదు... కనీసం పరామర్శకు కూడా వెళ్లనివ్వలేదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు.




