04-02-2026 02:05:30 AM
ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు కూలీల మృతి
డ్రైవర్ నిర్లక్ష్యమేనని పేర్కొన్న బాధితులు
జగిత్యాల జిల్లా మొగిలిపేటలో ఘోర ప్రమాదం
మల్లాపూర్, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో వ్యవసాయ కూలి పనులకు వెళ్లి ట్రాక్టర్లో సాయంత్రం తిరిగి వస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం మొగిలిపేట గ్రామ శివారులో ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు సుమారు పదిహేను మంది పనులు ముగించుకొని సాయంత్రం ట్రాక్టర్లో ఇంటికి బయలుదేరారు. చెరువు గట్టుపైన ఉన్న రోడ్డుపై డ్రైవర్ ఎర్రం శెట్టి గంగాధర్ (36)ట్రాక్టర్ ను అతివేగంగా నడపడంతో అదువు తప్పి రోడ్డు పక్కనే ఉన్న నీటి గుంతలో పడింది.
దీంతో సంపంగి సాయమ్మ (42), మంగళరాపు లలిత (42),రొడ్డ వైష్ణవి (13),పెద్దిరెడ్డి గంగు (45)లు అక్కడిక్కడే మృతి చెందారు. ఎల్ల గంగు (75) పరిస్థితి విషమంగా ఉండడంతో మెట్పల్లి ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన కూలీలకు చిన్న చిన్న గాయలతో బయట పడ్డారు.కాగా సంఘటనకు కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ గంగాధర్ పరారీలో ఉన్నట్లు పోలీస్లు తెలిపారు.