'ఐపీఎల్ టికెట్ల విక్రయాల్లో మోసం'
n ఉప్పల్ స్టేడియం ముందు విద్యార్థి సంఘాల నిరసన
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ఐపీఎల్లో తమ అభిమాన ఆటగాళ్ల విన్యాసాలను ప్రత్యక్షంగా చూడాలని ఆశపడుతున్న ప్రేక్షకులను.. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్వాహకులు తీవ్రంగా నిరాశ పరుస్తున్నారని.. విద్యార్థి సంఘ నాయకులు నిరసన చేపట్టారు. టికెట్ల విక్రయాల్లో ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతుందంటూ ఏఐవైఎఫ్, డీఐవైఎఫ్, పివైఎల్ విద్యార్థి సంఘాల నేతలు శనివారం స్టేడియం ముందు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నేతలు మైదానంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో స్టేడియం మెయిన్గేట్ ముందు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో టికెట్ల విషయంలో బ్లాక్ దందా నడుస్తోందని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ సత్య ప్రసాద్ ఆరోపించారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలో అన్నీ టికెట్లు ఏ విధంగా అమ్ముడూ పోతాయని ప్రశ్నించారు.






