సంత.. మోసమే అంతా!
కూరగాయల కొనుగోలులో తూకంలో మోసం..
కేజీకి పావుకేజీ పైనే తరుగు..
తూకంలో మోసము గుర్తించిన కొనుగోలుదారులు..
ప్రశ్నించిన వారిపైనే వాదనకు దిగిన దుకాణ నిర్వాహకురాలు..
మోతె: మోసాలకు పాల్పడుతూ డబ్బు సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు మనిషి అని చెప్పడానికి చక్కని ఉదాహరణ ఈ సంఘటన. మండల పరిధిలోని మామిళ్ళగూడెం గ్రామంలో ప్రతి ఆదివారం సంత నిర్వహిస్తారు. దీంతో చుట్టూ గ్రామాల ప్రజలు తమకు అవసరమైన సామాగ్రిని సంతలో కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇక్కడ మోసాలు ఎక్కువగా జరుగుతుండడంతో సంతలో అంతా మోసమే అంటూ కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. ఈ సంతలో భాగంగానే కూరగాయలు, ఎండు చేపల, అల్లం, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, పండ్లు, పప్పుదినుసులు మొదలైన వాటిని బేరమాడి తనకు నచ్చిన ధరకు కొనుగోలు చేస్తుంటారు. అయితే సంతలో కూరగాయలు అమ్మే ఓ దుకాణ నిర్వాహకురాలు కూరగాయలు తూచి ఇచ్చిన తర్వాత అవి తక్కువ వచ్చాయని కొనుగోలుదారులు గమనించారు.
వెంటనే ఆ కూరగాయలు వ్యాపారి కాంటలు వేసే తరాజును పరిశీలించగా తూకంలో తేడాలను గమనించినట్లు కొనుగోలుదారులు తెలిపారు. కేవలం రెండు చిన్న సైజులో ఉన్న టమాటాలను కాంటలో వేయగా పావు కిలోపైన ఉన్నాయంటూ సదరు దుకాణ నిర్వాకురాలును నిలదీశామన్నారు. అయితే ఆమె కూడా తమతో వివాదానికి దిగిందని తెలిపారు. అయితే ఇంత బాహటంగా మోసాలకు పాల్పడుతున్న అసలు కొలతలు, తూనికల అధికారుల తనిఖీలే లేకుండా పోయాయని ఈ కారణం చేతనే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయంటూ ఆరోపించారు. మోసం చేసి మా పైనే గొడవకు దిగిన మహిళపై పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.. ఇప్పటికైనా కొలతలు, తూనికుల అధికారులు స్పందించి ఇటువంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.




