09-10-2025 10:01:45 PM
ప్రజా ప్రభుత్వం ఏర్పడి 20 నెలలైనా నెరవేరని హామీలు..
ఆరు గ్యారంటీల హామీలతో మోసం: మాజీ ఎమ్మెల్యే..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): అదిగో పులి ఇదిగో బెబ్బులి, అనే సామెత లాగా ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఆయన మాట్లాడారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చిందని.. వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డుల కార్యక్రమం చేపట్టామన్నారు.
ఇందులో భాగంగా గురువారం సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల అమలు చేస్తామని 420 హామీలిచ్చిందన్నారు. హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం హామీలను విస్మరించడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయని సంక్షేమ పథకాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరడానికి వేలాదిమంది చేరుతున్నారని, కాంగ్రెస్ పార్టీని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజలు నమ్మసక్యంగా లేరని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సదాశినగర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అన్నారు.