గణేష్ మండపాలన్నింటికీ ఉచిత కరెంట్
కరెంట్ ఛార్జీలన్నీ కరీంనగర్ కార్పొరేషన్ చెల్లించాలని నిర్ణయం
దాదాపు 2 వేల గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ సరఫరా చేయాలనే లక్ష్యం
గత మూడేళ్లుగా గణేష్ మండపాల కరెంట్ బిల్లులన్నీ చెల్లించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
16వ డివిజన్లోని లక్ష్మీపూర్, మల్కాపూర్ లోనూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి
కరీంనగర్, ఆగస్టు 18 (విజయక్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న వినాయక మండపాలన్నింటికీ ఉచితంగా కరెంట్ ను అందించాలని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందుకు అయ్యే కరెంట్ బిల్లులన్నీ కరీంనగర్ కార్పొరేషన్ చెల్లిస్తుందని ప్రకటించారు.
భక్తియుత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఏటా దాదాపు 2 వేల గణేశ్ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఈ మండపాలకు వినియోగిస్తున్న కరెంట్ ఛార్జీలను మొత్తం బండి సంజయ్ కుమార్ తన సొంత డబ్బులు వెచ్చించి చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించిన నేపథ్యంలో ...గణేశ్ మండపాల కరెంట్ బిల్లులన్నీ కార్పొరేషన్ చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.
కరీంనగర్ పర్యటనలో భాగంగా మంగళవారం 21వ డివిజన్ విద్యానగర్ లోని శ్రీరాంనగర్ కాలనీలో కోటి రూపాయల మున్సిపల్ సాధారణ నిధులతో సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రపుల్ దేశాయ్, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ...తనను గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివ్రుద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకు రూ.22 వేల కోట్ల నిధులతో అనేక అభివ్రుద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అందులో 5 వేల కోట్లతో జాతీయ రహదారులను నిర్మించినట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి రూ.5 లక్షల చొప్పు నిధులు ఇచ్చానని, రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో నిధులిచ్చి గ్రామాలను అభివ్రుద్ధి చేస్తానని చెప్పారు. మరోవైపు తనను నమ్మి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను బీజేపీకి అప్పగించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు 100 రోజుల్లోనే రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే స్మార్ట్ సిటీ పేరుతో రూ.940 కోట్ల నిధులు తెచ్చి కరీంనగర్ ను అభివ్రుద్ధి చేసినట్లు వివరించారు.
వరంగల్ కు సైతం స్మార్ట్ సిటీ నిధులొచ్చినప్పటికీ... అక్కడ అభివ్రుద్ధికి నోచుకోలేదన్నారు. తనపై నమ్మకం ఉంచిన కరీంనగర్ ను అభివ్రుద్ధి, ఉత్సవాల నిర్వహణలో తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రభాగాన ఉంచేందుకు శాయాశక్తుల క్రుషి చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ప్రస్తుతం అభివ్రుద్ధే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లంతా కలిసికట్లుగా ఉంటూ కరీంనగర్ ను అభివ్రుద్ధి చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం అనంతరం 16వ డివిజన్ లక్ష్మీపూర్, మల్కాపూర్ కాలనీలో 15వ ఆర్ధిక సంఘం నిధులకు సంబంధించి రూ.15 లక్షల వ్యయంతో చేపట్టిన వాటర్ పైప్ లైన్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.






