18-01-2026 06:45:43 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం సంతాయపేటలోని భీమేశ్వర స్వామి ఆలయవరణంలో ఆదివారం ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, డాక్టర్ సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి సూచనలతో ఈ ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు చేశారు.
ఇద్దరు ప్యారాలీగల్ వాలంటీర్లను నియమించారు.ఈ ఉచిత న్యాయ సలహా కేంద్రంలో ప్యారాలీగల్ వాలంటీర్లు స్వప్న, నరసింహులు కలిసి అక్కడికి వచ్చిన భక్తులకు ఉచిత న్యాయ సలహాలు అందజేశారు. అలాగే వివిధ ప్రభుత్వ పథకాలు, ఉచిత న్యాయ సహాయం గురించి పాంప్లెట్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి. నాగరాణి స్వయంగా సందర్శించి, గుడి ఆవరణలో ఏర్పాటుచేసిన ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని పరిశీలించారు.