29-11-2024 11:47:05 PM
ప్లాస్టిక్ నిషేధాన్ని ఈ సభ ద్వారా ప్రచారం చేయాలి
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ (విజయక్రాంతి): జిల్లాలోని అంగగన్వాడి కేంద్రాల పరిధిలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న శుక్రవారం సభ మహిళలు, పిల్లల సంక్షేమానికి ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లాలోని చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ప్రాంగణంలో నూతన భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం శుక్రవారం సభ కార్యక్రమానికి హజరయ్యారు. సందర్భంగా అంగన్వాడి పిల్లలకు యూనిఫాం పంపిణీ చేశారు. బాల్య వివాహ్ ముక్త్ భారత్ పోస్టర్ ఆవిష్కరించిరు. గర్బిణీలకు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అప్పుడు కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.
గర్బిణీలు, బాలింతల ఆరోగ్యం పట్ల శుక్రవారం సభలో చక్కటి అవగాహ కల్పిస్తున్నారని తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారానికి ఈ సభ వేదికగా నిలుస్తోందని అన్నారు. ప్లాస్టిక్ నియంత్రించాలని నినాదాన్ని కూడా శుక్రవారం సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ప్రతి గ్రామంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్లాస్టిక్ వినియోగానికి చెక్ పెడతామని తెలిపారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో అధికారులందరి సమన్వయంతో గత ఆరు నెలలుగా ఈ శుక్రవారం సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా గర్బిణీలు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన ఆహారాన్ని సూచిస్తారని తెలిపారు.
పిల్లలు ఎత్తుకు తగిన బరువు ఉండేలా అంగన్వాడి, ఆరోగ్యశాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు సమన్వయంతో తల్లులకు తగు సూచనలు ఇస్తారని తెలిపారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు సుమారు 50 వేలు ఖర్చయ్యే 60 రకాల పరీక్షలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనివల్ల ప్రమాదకరమైన వ్యాధులను ముందే గుర్తించి నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఆర్డీవో మహేశ్వర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.