అసెంబ్లీ నుంచి మున్సిపల్ దాకా.. అంతా ‘వన్ సైడ్’!
- ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మా పక్షమే..
- కుతంత్రాలకు దేవుడు శిక్ష వేస్తాడు
- ప్రతిపక్ష నేతలు ఒంటి నిండా విషం నింపుకుని చిమ్ముతున్నారు
- వర్షాకాలం పంట నాటికి ’పాలెం వాగు’ పూర్తి చేస్తాం
- భద్రాచల నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయతో కలిసి నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు సన్మానం
భద్రాచలం, మార్చి 1 (విజయక్రాంతి): ‘రెండేళ్ల క్రితం రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలై.. పార్లమెంట్, ఉప ఎన్నికలు, మొన్నటి పంచాయతీ ఎన్నికలు, తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల దాకా ప్రజలు కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఏ ఎన్నిక వచ్చినా తీర్పు ’వన్ సైడ్’గానే ఉంది.
ఇది జీర్ణించుకోలేని గత పాలకులు ఒంటి నిండా విషాన్ని నింపుకుని చిమ్ముతున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు, ఆ భగవంతుడు వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం‘ అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం భద్రాచలం నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన సభలో ఆయన ప్రసంగించారు.
ప్రజా విజయాన్ని జీర్ణించుకోలేక విష ప్రచారం!
పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన వారు ధనిక తెలంగాణను అప్పుల పాలు చేశారని పొంగులేటి ధ్వజమెత్తారు. ‘అప్పుల రాష్ట్రంలోనూ మేము పేదవాడి ప్రేమను పొందుతూ, వారు చేయలేని పనులు చేసి చూపిస్తుంటే ప్రతిపక్షాలకు అరగడం లేదు. అందుకే ముఖ్యమంత్రిపై, మంత్రులపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. నిజం చెప్పే ధైర్యం, జ్ఞానం వారికి ఆ దేవుడు ఇవ్వలేదు. మళ్ళీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాత సీట్ల కంటే మరో 10 స్థానాలు అదనంగా గెలిచి, తెలంగాణ గడ్డపై మరోమారు మూడు రంగుల జెండా రెపరెపలాడటం ఖాయం‘ అని ధీమా వ్యక్తం చేశారు.
లక్ష కోట్లు దోచారు.. పాలెం వాగును వదిలేశారు
గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు. ‘దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పాలెం వాగు ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే, పదేళ్ల పాలనలో దానిని పూర్తి చేయాలనే జ్ఞానం వీరికి రాలేదు. 15 వేల ఎకరాలకు నీరు రావాల్సి ఉంటే, కేవలం 3-4 వేల ఎకరాలకే అందుతోంది. రెండు మూడు రోజుల్లోనే సీతక్క, నేను, ఇరిగేషన్ మంత్రి చర్చించి, రాబోయే వర్షాకాలం పంట నాటికి పాలెం వాగు మిగిలిన పనులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అలాగే రాళ్లవాగు వంతెనను కూడా ఇదే సీజన్లో పూర్తి చేస్తాం‘ అని హామీ ఇచ్చారు.
ఖాతాల్లోకి నేరుగా ‘ఇందిరమ్మ’ నిధులు
ఒకటో తారీఖున ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడ్డట్టే, ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే ఇందిరమ్మ ఇళ్ల నిధులు జమ చేస్తున్నాం. ములుగు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట ప్రాంతాల్లో తార్పాల్ గుడిసెల కింద నివసించే నిరుపేదలను చూసి, ఈ నియోజకవర్గాలకు మొదటి విడతలో అదనపు ఇళ్లను కేటాయించాం. ఏప్రిల్లో రెండో విడత ఇస్తాం.. ఇలా మొత్తం మూడు విడతల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తాం. ఇది కాగితాలకే పరిమితమయ్యే ప్రభుత్వం కాదు.
అధికార తాళం చెవి మీ దగ్గరే ఉండాలి!
కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచులకు మంత్రి పొంగులేటి ఆత్మీయ పిలుపునిచ్చారు. ‘మీరు ఎన్నికయ్యారు.. పరిపాలన కూడా మీరే చేయండి. అధికార తాళం చెవులను మా తమ్ముళ్ల (భర్తల) చేతికి ఇచ్చి మీరు వెనుక ఉండకండి. మంత్రి సీతక్క ఏ విధంగా ధైర్యంగా పాలిస్తున్నారో, మీ గ్రామ పంచాయతీల్లో మీరు కూడా అదే విధంగా పాలించి ఆదర్శంగా నిలవాలి‘ అని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), స్థానిక పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




