25-09-2025 10:59:51 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి ఫలితంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి ప్రభుత్వం భారీగా రూ.15 కోట్లు నిధులు మంజూరు చేసింది.
లింక్ రోడ్లు – డ్రైన్లకు రూ.6 కోట్లు
వర్షాకాలంలో దెబ్బతిన్న లింక్ రోడ్లు, డ్రైన్ల మరమ్మతుల కోసం రూ.6 కోట్లు కేటాయించబడ్డాయి. దీనితో పట్టణ రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.
పెద్ద చెరువు వద్ద పార్క్ నిర్మాణానికి రూ.3 కోట్లు
పచ్చదనం పెంపు, ప్రజలకు వినోదం అందించే ఉద్దేశంతో ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద విశాలమైన పార్క్ నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయి.
షాపింగ్ కాంప్లెక్స్కి రూ.5 కోట్లు
మున్సిపల్ వ్యాపార సముదాయానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించారు. దీని ద్వారా వాణిజ్య రంగానికి కొత్త ఊపిరి లభించనుంది.
ఇతర పనులకు రూ.1 కోటి
వివిధ చిన్నపాటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం రూ.1 కోటి నిధులు కేటాయించబడ్డాయి.
ఎమ్మెల్యే వ్యాఖ్యలు
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎల్లారెడ్డి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోంది. ఈ నిధులు పట్టణ రూపురేఖలను మార్చేలా ఉపయోగపడతాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ ఓ ప్రకటనలో తెలిపారు.