వరంగల్ జూ పార్క్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి
హనుమకొండ (మహబూబాబాద్), ఆగస్టు 11 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలోని హనుమకొండ కాకతీయ జూ పార్క్ అభివృద్ధి కోసం ‘కాంపా’ నిధులు మంజూరు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మంగళవారం న్యూఢిల్లీలోని కేంద్ర జూఅధారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్ వి.క్లైమేట్ బెన్ కు వినతి పత్రం అందజేశారు.
జూ పార్కులో సింహాల ఎంక్లోజర్, హైనా, జాకల్, వైల్డ్డాగ్ ఎన్క్లోజర్లు, నైట్ షెల్టర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ అటవీ శాఖ ఇప్పటికే కేంద్ర జూ అథారిటీకి సమర్పించినట్లు చెప్పారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు సవరణలు చేసి డిజైన్లు సమర్పించినందున వాటికి త్వరగా ఆమోదం ఇవ్వాలని కోరారు. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జూ పార్కులో జంతువుల సంరక్షణతో పాటు మొక్కల పెంపకం, పచ్చదనం అభివృద్ధి, పార్కు విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎంపీ కావ్య విజ్ఞప్తి చేశారు.






