11-11-2025 01:51:19 AM
-ప్రజల సందర్శనార్థం ఎన్ఎఫ్సీ నగర్కు అందెశ్రీ పార్థివదేహం
-మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి
ఘట్కేసర్, నవంబర్ 10 (విజయక్రాంతి): అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం ఘట్కేసర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా, డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ చక్రపాణి, కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్రెడ్డి, ఇతర అధికారులు అంత్యక్రియలు జరిపే స్థలాన్ని పరిశీలించారు.
మొదట అందెశ్రీ పార్థివదేహాన్ని ఎన్ఎఫ్సీ నగర్లో ఆయన నూతనంగా నిర్మిస్తున్న ఇంటి భవనం వద్ద ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి అక్కడి నుంచి అంతిమ యాత్ర ఊరేగింపును అంత్యక్రియల స్థలం వద్దకు తరలించి, పూర్తి చేస్తారు. అందెశ్రీ సొంతంగా ఎన్ఎఫ్సీ నగర్ కాలనీలో ఇంటి నిర్మాణం జరిపి, నివాసం ఉండేందుకు నిర్ణయించుకున్నారని, అందుకే ఇక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలిసింది.