కాంగ్రెస్పై వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్
జీవన్ రెడ్డికి గజ్జల కాంతం హెచ్చరిక
కరీంనగర్,(విజయక్రాంతి): టిపిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నగరంలోని ఆర్ & బి అతిథి గృహంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి, పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను గజ్జల కాంతం తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల పాటు జీవన్ రెడ్డిని ఆదరించి, పదవులు ఇచ్చి ఎదగడానికి సహకరించిందని, అయితే ఆయన పార్టీకి చేసిన సేవలు శూన్యమని విమర్శించారు.
జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల కోసం ఆయన ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంతమందిని గెలిపించారో వివరించాలన్నారు. తన వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాలకే పరిమితమై, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ద్వారా ఎదిగిన జీవన్ రెడ్డి, బీసీ, ఎస్సీ, మైనారిటీలు మరియు అగ్రకుల పేదలకు న్యాయం చేయలేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. అంతేకాక, ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి, 500 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని గజ్జల కాంతం ఆరోపించారు. భవిష్యత్తులో మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే సహించబోమని, ఖబడ్దార్ అంటూ జీవన్ రెడ్డికి ఆయన గట్టిగా హెచ్చరిక జారీ చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సముద్రాల అజయ్, గడ్డం నాగరాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.




