calender_icon.png 16 June, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో గుడుంబా అరికట్టాలి

16-06-2025 05:08:39 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణం, మండలంలోని గ్రామాలలో గుడుంబా విచ్చలవిడిగా సరఫరా, అమ్మకాలు జరుగుతున్నాయని, వెంటనే అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ బిజెపి మండల నాయకులు వంజరి వెంకటేష్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak)కు వినతిపత్రం అందచేశారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మండలంలోని వెంకటాపుర్ గ్రామ పంచాయతీ పరిధిలో గుడుంబా అమ్మకాలు అధికమయ్యాయని, గుడుంబాకు బానిస కావడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గుడుంబా సేవించి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని, యువకులు గుడుంబాకీ బానిసలు అవుతూ చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దదిక్కు కోల్పోయి కుటుంబాలు వీధిన పడుతున్నాయని, పిల్లల పోషణ తల్లికి భారం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం గుడుంబా తయారీ దారుల మీద పిడియాక్ట్ కేసులు నమోదు చేయడం, గుడుంబా వ్యాపారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతో గుడుంబా అమ్మకాలు నిలిచిపోయాయని ఆన్నారు.

ప్రస్తుతం కొంతమంది ముఠాగా ఏర్పడి గుడుంబాను గ్రామాలకి విచ్చలవిడిగా సరఫరా చేస్తు అమ్మకాలు సాగిస్తున్నారని, దీంతో గ్రామాల్లో గుడుంబా గుప్పుమంటుందని వెంటనే అధికారులు స్పందించి గుడుంబా తయారు చేసి గ్రామాలకు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టి గుడుంబా అమ్మకాలు అరికట్టాలని ఆయన కోరారు.