ఢిల్లీలో అడుగుపెట్టిన గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్
న్యూఢిల్లీ: జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్(gangster lawrence bishnoi) సోదరుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడు అన్మోల్ బిష్ణోయ్ను(Gangster Anmol Bishnoi) అమెరికా నుంచి బహిష్కరించిన తర్వాత ఎన్ఐఏ అధికారులు భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారు. నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల కేసులో కూడా నిందితుడిగా ఉన్న అన్మోల్ను ఎన్ఐఏ అధికారికంగా అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు తరలించింది. పంజాబ్లోని ఫాజిల్కాకు చెందిన అన్మోల్ ను అమెరికా తిరిగి పంపింది. లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిపై దేశవ్యాప్తంగా దాదాపు 18 కేసులు పెండింగ్లో ఉన్నాయి.
2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా(Punjabi singer Sidhu Moose Wala) హత్య, 2024లో ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య, సల్మాన్ ఖాన్ ముంబై నివాసం వెలుపల జరిగిన కాల్పుల్లో అతని పాత్ర ఉందని ఆరోపిస్తున్న అంశాలపై ఏజెన్సీలు దృష్టి సారించాయి. 2022లో సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత అన్మోల్ నకిలీ పాస్పోర్ట్పై పారిపోయాడని అనుమానిస్తున్నారు. గత వారం అతని ఆశ్రయం దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. నకిలీ పత్రాలతో ప్రయాణించారనే ఆరోపణలతో అతన్ని అరెస్టు చేశారు. 2023లో ఎన్ఐఏ అతనిపై చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత గత ఏడాది జనవరిలో భారత్ అధికారికంగా అన్మోల్ను అప్పగించాలని కోరింది. 2020-2023 మధ్య ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలలో అతను మరో వాంటెడ్ గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్లకు సహాయం చేశాడని ఎన్ఐఏ ఆరోపించింది.




