19-11-2025 04:32:59 PM
హైదరాబాద్: తెలంగాణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు కూడలి వద్ద ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి ఆ మహనీయురాలి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం పలువురు మహిళా సమాఖ్య ప్రతినిధులకు చీరలను అందించి, రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈరోజు నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు, మార్చి 1 నుంచి 8 తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపు మున్సిపల్, పట్టణ, నగర ప్రాంతాల్లో మిగత చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.
“ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలు, పెట్రోల్ బంక్లు అప్పగించడం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యమే కాకుండా బస్సులకు యజమానులను కూడా ఆడబిడ్డలను చేశామని గుర్తుచేశారు. సోలార్ పవర్ ప్లాంట్లు అందించడానికి ప్రత్యేక కార్యాచరణలో ముందుకు వెళుతున్నామని, స్వర్గీయ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా దేశంలో అనేక విప్లవాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ముఖ్యంగా బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చివరి రక్తపు బొట్టును ధారపోశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
చీరల విషయంలో ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదని, ఇది మన ఆత్మగౌరవం, ప్రతి ఆడబిడ్డకు చీర అందుతుందన్నారు. ఆడబిడ్డలకు సారె పెట్టాలన్న ఆలోచనతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు సీతక్క, దామోదర రాజ నరసింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, GHMC మేయర్ విజయలక్ష్మి గద్వాల్ తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.