దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ విజయవంతం
కామారెడ్డి అర్బన్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం జెండర్ అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గ్రామపంచాయతీ నుంచి ఒక్కో జెండర్ పాయింట్ పర్సన్గా మొత్తం 29 మంది పాల్గొన్నారు. గ్రామాల్లో హింసలేని కుటుంబాల నిర్మాణం, అంటరానితనం నిర్మూలన, జననం-మరణం నమోదు ప్రాధాన్యత, బాల్య వివాహాల నివారణ, బాల కార్మికుల నిర్మూలన, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు.
జెండర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ లింగ గౌడ్ సమాన పనికి సమాన వేతనం, కుటుంబాలకు అదనపు ఆదాయం అవసరం వంటి అంశాలను వివరించారు. ఎస్ఐ ప్రభాకర్ మానవ అక్రమ రవాణా నిర్మూలనపై మాట్లాడగా, ఐసిడిఎస్ సూపర్వైజర్ సుప్రియ బాల్య వివాహాల నివారణపై సూచనలు చేశారు. మహిళా సంఘాల అభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏపిడీ విజయలక్ష్మి, ఐబీ డీపీఎం శ్రీనివాస్, మండల సమాఖ్య సభ్యులు, ఏపీఎం శ్రీనివాస్ లు, సీసీలు, ఎంఎస్ఏ సభ్యులు పాల్గొన్నారు.




