27-05-2025 12:11:01 AM
సంగారెడ్డి, మే 26(విజయక్రాంతి): వ్యవసాయశాఖ ఖరీఫ్ సాగుకు సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి అధికారులతో పాటు అనుబంధ శాఖల వారిని సంప్రదించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించింది. దీనిపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సమావేశం నిర్వహించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఎరువులు, విత్తనాలు, రైతులకు అందుబాటులో ఉంచటం,
సాగులో శాస్త్రీయత పాటించటంతో పాటు నకిలీలపై అప్రమత్తం చేయాలని సూచించారు. ఇదే సమయంలో వారు క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన చర్యలు, నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు. డివిజన్లు, మండలాల వారీగా అందుబాటులో ఉంచాల్సిన ఎరువులు తదితర అంశాలపై ఇప్పటినుంచే ఆ శాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
అవగాహనపై స్పష్టత కరువు...
ఖరీఫ్లో భూసార పరీక్షలు, విత్తనాల ఎంపిక, అందుబాటులో ఎరువులు, తదితర వివరాలను తెలియజేయాల్సిన రైతు చైతన్య యాత్రల నిర్వహణపై స్పష్టత లేదు. మరోవైపు జిల్లాలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు తదితర అంశాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మార్కెట్లో మాత్రం కొందరు వ్యాపారులు ఇప్పటి నుంచే బీటీ-3 పత్తి విత్తనాలను గుట్టుగా విక్రయించేందుకు తిరుగు తున్నారు.
గతంలో ప్రభుత్వమే పలు రకాల విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీపై అందించేది, గత ఐదారు ఏళ్ల నుంచి వాటిపై కోత విధిస్తూ క్రమంగా నిలిపేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో విత్తనాలు, వ్యవసాయ పరికరాలపై రాయితీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
8.04 లక్షల ఎకరాల్లో సాగు..
జిల్లాలో వచ్చే ఖరీఫ్ సీజన్లో మొత్తం 8.04 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయా పంటలు సాగు చేయొచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. గతేడాది కంటే ఈయేడు సుమారు 70 వేల ఎకరాలు అధికంగా పత్తి పంటను పండించే అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్కు గాను వరి పంట 1,65,173 ఎకరాలు, పత్తి 3,87,539, మొక్కజొన్న 7,983, కంది 84,821, సోయాబీన్ 79,613, పెసర 14,826, మినుములు 9,787, హార్టికల్చర్ 28,964, ఇతర పంటలు 26,256 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
అయితే గత ఏడాది వానాకాలం సీజన్లో 7,33,047 ఎకరాల్లో సాగవ్వగా, ఈ యేడు 70వేల ఎకరాలు అదనంగా సాగయ్యే అవకాశం ఉంది. అయితే వరి, మొక్కజొన్న, జీలుగు, జనుము, సోయాబీన్, కందుల విత్తనాలను సమయానికి అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక విస్తీర్ణంలో పండించే పత్తి విత్తనాలు లైసెన్సు కలిగిన ఫర్టిలైజర్ అండ్ సీడ్స్ దుకాణాలలో అవసరమైన మేరకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
ఎరువుల విషయానికొస్తే.. డీఏపీ 16,045 మెట్రిక్ టన్నులు, యూరియా 41,900, కాంప్లెక్స్ 36,804 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 9,225 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని చెబుతున్నారు. మొత్తం ఖరీఫ్ సీజన్కు సంబంధించి 1,23,656 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం పడుతుండగా ప్రస్తుతం 18,757 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి.