02-11-2025 12:59:03 AM
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’. గీతాఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.
ఈ సినిమా ఈ నెల 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. తర్వాత ఇదే నెల 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ థియేట్రికల్ రిలీజ్కు రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ధీరజ్, విద్య చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.
రష్మికకు రెట్టింపు పారితోషికం అందుకే
“ప్రొడ్యూసర్గా కమర్షియల్గా మూవీ ఉండాలనుకుంటాం. కానీ, రిస్క్ చేసినా ఫర్వాలేదు అనేంత బాగా ఈ స్టోరీ నచ్చింది. లవ్స్టోరీస్ను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఈ కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది. అలాంటప్పుడు స్టార్స్ను ఈ మూవీకి హీరోగా తీసుకోలేం. పర్ఫార్మర్స్నే తీసుకోవాలి. దీక్షిత్ మంచి పర్ఫార్మర్. ఈ ఏజ్ గ్రూప్లో నాకు తెలిసి వాళ్లలో ఆయనే ఈ మూవీకి పర్పెక్ట్ అనిపించింది.
సినిమా చూశాక మీకూ అదే ఫీల్ కలుగుతుంది. కన్నడ మార్కెట్కు ఉపయోగపడుతుందని దీక్షిత్ను తీసుకోలేదు. కానీ రష్మిక, దీక్షిత్ల వల్ల అక్కడ అడ్వాంటేజ్ అవుతుంది. తెలుగులో వస్తున్న పెద్ద సినిమాలను కన్నడ వెర్షన్లో రిలీజ్ చేస్తున్నారు.
చిన్న సినిమాలూ ఇలా ట్రై చేస్తున్నా కొన్నిసార్లు టైమ్ సరిపోక ఆ భాషలో రిలీజ్ చేయడం లేదు. రష్మిక ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు, కాబట్టి ఆ కృతజ్ఞతతో రెట్టింపు పారితోషికం ఇస్తున్నాం. కోవిడ్ తర్వాత ప్రేక్షకుల్ని థియేటర్స్కు రప్పించాలంటే మంచి కంటెంట్ ఉంటేనే సాధ్యమవుతోంది” అని ధీరజ్ తెలిపారు.
ధీరజ్ మొగిలినేని
అల్లు అరవింద్ ఇచ్చే సలహా కూడా అదే
“ఈ కథ విన్నప్పుడే మేము బాగా కనెక్ట్ అయ్యాం. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఒక మెసేజ్ను తీసుకుంటారు. ఇది కమర్షియల్ ఫార్మేట్ స్టోరీ కాకపోయినా రిస్క్ తీసుకోవాలని నేను, ధీరజ్ అనుకున్నాం. సెన్సార్ వాళ్ల దగ్గర నుంచి డైరెక్టర్కు నేషనల్ అవార్డ్ దక్కుతుందనే ప్రశంసలు వచ్చాయి. ఈ కథ రియల్ ఇన్సిడెంట్స్తో ఇన్స్పైర్ అయి రాసినా, మిగతా అంతా స్క్రిప్ట్ చేసుకున్నదే.
షూటింగ్ ఎక్కువగా ఒక కాలేజ్లో చేశాం. వర్కింగ్ డేస్లో కాలేజ్లు ఇవ్వరు. అప్పటికి రష్మిక రెండు మూడు బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాటి షూటింగ్ వేరే సిటీస్లో జరిగేది. దాంతో కొంత డేట్స్ వల్ల డిలే అయ్యింది. షూటింగ్ చివరలో కార్మికుల సమ్మె వచ్చింది. తుది దశ కాబట్టి మాకు పెద్దగా ప్రాబ్లమ్ కాలేదు. ఇది వుమెన్ సెంట్రిక్ మూవీ కాదు. కాలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే ప్రేమకథ.
సినిమా చూసిన ప్రేక్షకులంతా ఈ కథకు రిలేట్ అవుతారు. తమకు తెలిసిన వారి ప్రేమ కథలు వారికి గుర్తొస్తాయి. ఈ ప్రాజెక్ట్ సమంతతో చేయాలని అనుకోలేదు. ఈ స్క్రిప్ట్కు రష్మికనే అనుకున్నాం. ఆమెకు ఈ స్క్రిప్ట్ పర్సనల్గా చాలా నచ్చింది. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఆమెతో ఎలాంటి డిస్కషన్స్ జరగలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటికి పదిసార్లు ఆలోచించి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నాం. అల్లు అరవింద్ ఇచ్చే సలహా కూడా అదే” అని విద్య చెప్పారు.
విద్య కొప్పినీడి