19-08-2025 12:11:18 AM
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): టీ ఫైబర్ పనులు జరిగిన తీరు.. ప్రస్తుత పరిస్థితి.. భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. టీ ఫైబర్పై సోమవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. టీ ఫైబర్ పనులు చేసిన కాంట్రాక్ట్ సంస్థలకు నోటీసులు ఇచ్చి పనులు చేసిన తీరుపై నివేదిక కోరాలని ఆదేశించారు.
సంస్థలో ఉద్యోగుల సం ఖ్య, వారి పని తీరును సమీక్షించాలని చెప్పారు. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమైనందున పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందించాలని స్పష్టంచేశారు. టీ ఫైబర్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రణాళిక ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు చేసిన వ్యయం, పూర్తి కావ డానికి అవసరమయ్యే నిధులు, వాటి సేకరణ, కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పొందుపర్చాలని అధికారులకు సూచించారు.
సమీక్షలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వీ శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్, ప్రత్యేక ముఖ్యకార్యదర్శులు జయేశ్రంజన్, సంజయ్కుమార్, డిప్యూటీ కార్యదర్శి భవేష్ మిశ్రా, టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.