రూ.500 కోట్లు కేటాయింపు.. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
హైదరాబాద్: జూన్ 26 నుండి జూలై 7, 2027 వరకు అత్యంత పవిత్రమైన గోదావరి పుష్కరాలను(Godavari Pushkaralu) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.500 కోట్లను ప్రతిపాదించింది. ఈ పవిత్ర కాలంలో సుమారు ఎనిమిది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో, కుంభమేళా(Kumbh Mela) తరహాలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లు, అలాగే రహదారుల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి వంటి సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన పనులను పర్యవేక్షించేందుకు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) నాయకత్వంలో ప్రభుత్వం ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత, జన సమూహాల నిర్వహణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకునే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ గోదావరి పుష్కరాల నిర్వహణ నిమిత్తం, బడ్జెట్లో రూ. 500 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.




