ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
రైతుల ఆవేదన, హరిగోస వర్ణనాతీతం
రైతులపై ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోంది
మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి, మే27 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైంది ఇది ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యమే కాక రైతులపై ఉద్దేశపూర్వకంగా సకాలంలో యూరియా ఇవ్వకుండా, కరెంట్ సరఫరాలో లోపం చేయడం కొనుగోలులో జాప్యం చేయడం వల్ల రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని ప్రభుత్వంపై భారం పడకుండా ఉంటుందని సిఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.
బుధవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి అనంతరం మనిగిల్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల వైఫల్యం వల్ల రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు నీటి పాలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో కె.సి.ఆర్ వెంటనే ధాన్యం కొనుగోలు చేసి వారంలోపల రైతుల ఖాతాలో డబ్బులు వేశారని ఆయన గుర్తు చేశారు.
కానీ నేడు రేవంత్ పాలనలో రైతులు ధాన్యాన్ని అమ్మడానికి నెలలుగా వేచి చూడాల్సివస్తుందని దుయ్యబట్టారు. రైతుల ఉసురు తాకి ప్రభుత్వం ఆగం కాక తప్పదు అని ఆయన హెచ్చరించారు. జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, రైతు సమితి జిల్లా మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేణు యాదవ్, కుమార్ యాదవ్ మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.






