బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): 99 రోజుల ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక గ్రామసభ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ పుర్మాణి రాజశేఖర్ రెడ్డి మరియు గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిఏ పృథ్వీ రాజు ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రెండు చక్రాల వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు మరియు సిగ్నల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు.
రోడ్డుపై ప్రమాదానికి గురైన వారిని వెంటనే ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం తరఫున ₹25,000 వరకు ప్రోత్సాహకంగా అందిస్తుందని తెలిపారు. సహాయం చేసిన వ్యక్తులు పోలీస్ స్టేషన్ లేదా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా, ప్రమాదాల్లో అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ₹2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ, అత్యవసర సమయంలో ముందుకు వచ్చి ప్రాణాలను కాపాడాలని పిలుపునిస్తూ ఈ గ్రామసభను విజయవంతంగా ముగించారు.




