కేజీబీవీలో అదనపు తరగతి గదులకు భూమిపూజ
జైనూర్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో నాణ్యమైన విద్య అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు అన్నారు. శుక్రవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పోచంలొద్ది గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.29 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు స్థానిక సర్పంచ్ మడావి మనోహర్తో కలిసి భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా విశ్వనాథ్ రావు మాట్లాడుతూ కేజీబీవీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు బోధన సిబ్బంది సమష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు.అందువల్ల గత కొన్ని సంవత్సరాలుగా పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాయని కొనియాడారు.






