19-09-2025 02:51:57 PM
హైదరాబాద్: పండుగలు వస్తే చాలు ఆర్టీసీ బస్సు ఛార్జీలు(RTC bus fare hike) అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవుతుండటం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె వెలుగు సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. అదనపు సర్వీసుల పేరిట 50శాతం అదనపు ఛార్జీల దోపిడీ.. ప్రయాణికులకు పెను భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ సంబరం లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్ గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజా పాలన, ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి? అని హరీశ్ రావు ప్రశ్నించారు.