19-12-2025 01:28:23 PM
హైదరాబాద్: పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య రుణం కోసం మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(MLA Thanneeru Harish Rao) బ్యాంకులో తన స్వగృహన్ని మార్టిగేజ్ చేశారు. కళాశాల యాజమాన్యం మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు వచ్చినా ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ. 7.50 లక్షలు చెల్లించాలని సూచించింది. బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామన్న బ్యాంకర్స్ తేల్చిచెప్పారు. ఈ నెల 18వ తేదీన ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటును తిరస్కరించే పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని విద్యార్థిని మమత, ఆమె తండ్రి కొంక రామచంద్రం హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు.
విషయం తెలుసుకున్న హరీశ్ రావు క్షణం ఆలస్యం చేయకుండా సిద్దిపేటలోని తన స్వగృహన్ని బ్యాంకులో తనఖా పెట్టి విద్యార్థిని చదువు కోసం రూ. 20 లక్షల ఎడ్యూకేషన్ లోన్ మంజూరు చేయించారు. మమత హాస్టల్ ఫీజు కూడా లక్ష రూపాయలు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. హరీష్ రావు నాడు ఆటో కార్మికుల కోసం, నేడు నిరుపేద విద్యార్థిని చదువు కోసం తన ఇంటిని తనఖా పెట్టారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థిని మమత మాట్లాడుతూ... పీజీ సీటు పోతుందని బాధపడ్డాననని హరీశ్ రావుతో చెబుతూ కన్నీరు పెట్టుకుంది. చదువు విలువ, నిరుపేద విద్యార్థులు పడే ఇబ్బందుల గురించి క్షుణ్ణంగా తెలిసిన హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టమని పేర్కొంది. విద్యార్థిని మమత తండ్రి కొంక రామచంద్రం మాట్లాడుతూ... హరీషన్నది తీర్చుకోలేని రుణమని పేర్కొన్నారు.