13 March, 2026 | 2:48 PM

మూసీలో చేసేది బ్యూటిఫికేషనా.. లూటిఫికేషనా?

13-03-2026 01:43 PM

కమీషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు

పేదల ఇళ్లపై రేవంత్ సర్కార్ బుల్‌డోజర్లతో యుద్దం

హైదరాబాద్: కేవలం పేదల ఇళ్లు కూల్చటం గురించి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఆలోచిస్తోందని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు(Harish Rao) ఆరోపించారు. డబ్బులు లేవంటున్న సర్కార్ రూ. 1.50 లక్షల  కోట్లతో మూసీ సుందరీకరణ అంటోందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, ఉద్యోగులకు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు డబ్బులు లేవంటున్నారు. ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలో రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు లేరని హరీశ్ రావు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతుభరోసా వేస్తామన్నారు.. ఇప్పటివరకు లేదని మండిపడ్డారు. కమీషన్ల కోసమే.. భారీ అంచనా వ్యయంతో మూసీ ప్రాజెక్టు అంటున్నారని తెలిపారు. మూసీ ప్రాజెక్టు కోసం ఇప్పుడు 10 వేల ఇళ్లు కూలగొడతామని ఆర్డర్ ఇచ్చారని హరీశ్ రావు  వివరించారు.

మూసీని శుద్ధి చేసేందుకు 3,279 ఎకరాల భూమి ఎందుకు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సర్కార్(Revanth Reddy Government) పేదల ఇళ్లపై బుల్‌డోజర్లతో యుద్ధం చేస్తోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని బుల్‌డోజర్ పాలన రాహుల్ గాంధీకి కనిపించటం లేదా?, మూసీ ప్రాజెక్టుకు(Musi project) డీపీఆర్ సిద్ధం చేశారా.. ప్రజల ముందు పెట్టాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. కనీసం డీపీఆర్ లేకుండా పేదల ఇళ్లు కూల్చటానికే ఎందుకు సిద్ధమయ్యారు?, డీపీఆర్ రూపొందించడానికి 18 నెలలు పడుతుందని 2 నెలల క్రితం చెప్పారు. మూసీలో చేసేది బ్యూటిఫికేషనా.. లూటిఫికేషనా అని హరీశ్ రావు ప్రశ్నించారు. మూసీ నది బఫర్ జోన్ విషయంలో గందరగోళం ప్రకటనలు  చేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.