08-08-2025 12:00:00 AM
అత్యవసరంగా ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్
సీపీఆర్ చేసినా ఫలితం శూన్యం
కోరుట్ల, ఆగస్టు 7: ఉపాధి కోసం గల్ఫ్కు వలస వెళ్లిన కార్మికుడు.. ఎన్నో ఏళ్లకు తిరిగి వస్తుండగా తాను ప్రయాణిస్తున్న విమానంలోనే అతనికి గుండెపోటుకు గురై మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీరాముల శ్రీధర్కు భార్య మీన, ఇద్దరు కూతుళ్లు స్నేహిత(12), రస్మిత (10) ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో శ్రీధర్ కొన్నేళ్ల క్రితం గల్ఫ్కు బతుకుదెరువు కోసం వెళ్లాడు.
ఈ నెల 5న సౌదీ దమ్మామ్ నుంచి హైదరాబాద్కు విమానంలో తిరిగుపయణమయ్యాడు. మార్గమధ్యంలో తనకు శ్వాస ఆడటం లేదని విమానయాన సిబ్బందితో తెలియజేయగా విమానాన్ని ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. డాక్టర్లు, విమానశ్రాయ సిబ్బంది సీపీఆర్ చేయగా ఎలాంటి చలనం లేకపోవడంతో మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.
గురువారం ఉదయం 8 గంటలకు ముంచై నుంచి కోరుట్లకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. తమది నిరుపేద కుటుంబమని, కనీసం ఉండటానికి ఇల్లు లేదని ఇలాంటి పరిస్థితుల్లో విగతజీవిగా తన భర్త వచ్చాడంటూ మృతుడి భార్య మీన విలపించింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది.