తుఫాన్ హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం ఉదయం నాటికి మరింత బలపడి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) తెలిపింది. ఈ వ్యవస్థ వాయువ్య దిశగా ప్రయాణించి అక్టోబర్ 3న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అంచనాల దృష్ట్యా ఐఎండీ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. గురువారం-శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలలో(Telugu States) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే మూడు రోజులు తీరప్రాంతాల్లో గంటకు 30 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ నగరంలోని నిన్న మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి ఎండ కొడుతున్నప్పటికీ ఎప్పుడు వర్షం కురుస్తుందోనని నగర ప్రజలు పరేషాన్ లో ఉన్నారు.




