కుప్పకూలిన హెలికాప్టర్
ఇద్దరు అమెరికన్ పైలెట్లు సురక్షితం
వాషింగ్టన్, జూన్ 9 (విజయక్రాంతి): హోర్ముజ్ పై ఇరాన్ విధించిన దిగ్బంధనాన్ని ఛేదించే ప్రయత్నాల్లో భాగంగా, యూఎస్ సెంట్రల్ కమాండ్ హెలికాప్టర్లతో పాటు ఫైటర్ జెట్లు, డ్రోన్లతో పహారా కాస్తోన్న అపాచీ హెలికాప్టర్ ఒకటి మంగళవారం కుప్పకూలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధ విమానం కూలిపోవడాన్ని ధ్రువీకరించి మీడియాతో మాట్లాడారు.
అపాచీ హెలికాప్టర్ హోర్ముజ్ సమీపంలో ధ్వంసమైందని, ఇద్దరు పైలెట్లు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ పహారా కాస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. న్యూయార్క్లో జరిగిన విలేఖరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. అమెరికాఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ సైన్యం నాశనమైందన్నారు. టెహ్రాన్ వద్ద 21 శాతం మాత్రమే క్షిపణి సామర్థ్యం ఉందన్నారు.
ఇరాన్ దురాక్రమణను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ దాడుల్లో అమెరికాకు సైతం భారీ నష్టం వాటిల్లిందని ఇప్పటివరకు 13 మంది అమెరికన్ సైనికులు మరణించగా, 399 మంది గాయపడ్డారని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. పలు యుద్ధ విమానాలు సైతం కూలిపోయాయని పేర్కొంది. అపాచీ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సైనికాధికారులు ప్రకటించారు. కాగా తమపై దాడిచేసేందుకు ప్రయత్నించిన హెలికాప్టర్ను, డ్రోన్లను కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. ఫిబ్రవరిలో అమెరికాఇరాన్ ల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి యూఎస్ సైనిక హెలికాప్టర్ కూలిపోవడం ఇదే తొలిసారి.






