17-07-2025 12:15:31 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ,(విజయక్రాంతి): బుధవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం గుండ్ల సాగర్ గ్రామంలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్న మంద సారంగపాణి అనే రైతు తన పంట క్షేత్రంలో ఆయిల్ పామ్ గెలల మొదటి కోత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, అధికారులు, స్థానిక రైతుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు.
మిగతా పంటల కంటే ఆయిల్ పామ్ పంటకు రైతులకు మంచి గిట్టుబాటు అయ్యే ఆదాయం లభిస్తుందన్నారు. వరి, ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందవచ్చు అని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహకాలు ఉన్నాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట సాగుతో స్థిరమైన ఆదాయం రైతులకు లభిస్తుందన్నారు. ఆయిల్ పామ్ పంటను సాగుచేసిన రైతు మంద సారంగపాణి కి కలెక్టర్ చేతుల మీదుగా చెక్కును పంపిణీ చేశారు.