12-10-2025 05:01:46 PM
అర్మూర్ (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ గటడి ఆనంద్ ను అర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాది లోక భూపతి రెడ్డి ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య చరిత్రలో 2005 సంవత్సరం అక్టోబర్ 12న ప్రజల చేతిలో వచ్చినటువంటి బ్రహ్మాస్త్రం సమాచార హక్కు(సహ) చట్టమని అన్నారు. ఈ సహ చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి కావడం హర్షించదగిన విషయమన్నారు. గటడి ఆనంద్ గత 15 సంవత్సరాలుగా నిరంతరం ప్రజలలో ఉంటూ విద్యార్థులకు ఆయా గ్రామాలలో ఉన్న గ్రామాభివృద్ధి కమిటీలకు ఈ యొక్క సమాచార హక్కు చట్టం యొక్క విశిష్టతను తెలియజేశరని అన్నారు. వారికి కావలసినటువంటి సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వారికి సహకరించి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రయోజనాలు కల్పించడం అభినందనీయమని కొనియాడారు.
ఇదే విధంగా సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ గటడి ఆనంద్ మాట్లాడుతూ తనను సన్మానించిన ఆర్మూర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులకు, సీనియర్ న్యాయవాది లోక భూపతిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తాను చేస్తున్న సమాచార హక్కు చట్ట కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతే న్యాయం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, సమాచార హక్కు చట్టం ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు తదితరులు పాల్గొన్నారు.