సముద్రలింగాపూర్లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
- కతీజ సయ్యద్ల స్వంతింటి కల సాకారం
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లను అందిస్తూ వారి స్వంతింటి కలలను నెరవేర్చుతోందన్నారు.
కతీజ సయ్యద్ కుటుంబానికి ఇరవై ఏళ్లుగా ఉన్న స్వంతింటి ఆశ నెరవేరడం ఆనందకరమని పేర్కొన్నారు. గుడిసెలు లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అలాగే ఈ నెలలో రెండు లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పంపించిన సారె చీరలను లబ్ధిదారులకు అందజేశారు. స్వంతింటి కల నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.






