08-06-2025 07:43:26 PM
జగదేవపూర్ (విజయక్రాంతి): భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జగదేవపూర్ లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ చంద్రమోహన్(SI Chandramohan) మాట్లాడుతూ... నిర్మల్ నగర్ గ్రామానికి చెందిన కర్రె కిరణ్(27) ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొని జగదేవపూర్ లో నివాసం ఉంటున్నారన్నారు. కొంత కాలంగా కిరణ్, అతని భార్య మధ్య మనస్పర్థలు తలెత్తి ఇంటినుండి వెళ్ళిపోయింది. భార్య తిరిగి కాపురానికి రాకపోవడంతో కిరణ్ మనస్తాపం చెంది శనివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో తన నివాసంలో మంచం నవారును స్లాబ్కు కట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా గజ్వెల్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారన్నారు. ఈ ఘటనపై మృతుని తండ్రి మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. కాగా కిరణ్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య లేదా కుటుంబాల మధ్య ఏవైనా వివాదాలు, మనస్పర్థలు ఉంటే వాటిని శాంతియుతంగా, పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, క్షణికావేశంలో తీసుకునే కఠిన నిర్ణయాలు కుటుంబాలను అనాధ స్థితికి తీసుకెళ్తాయని ఎస్ ఐ అన్నారు. అందువల్ల ఇలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడకుండా సహనంగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.