25-06-2025 10:03:52 AM
చేవెళ్ల: భార్య లేని భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం(Moinabad Mandal) మేడిపల్లి గ్రామానికి సాలె రమేశ్(35), పుష్పలత(32) దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. నాలుగు రోజుల కింద(21న) అనారోగ్య కారణాలతో భార్య మృతి చెందింది. దీంతో రమేశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం రోజు ఉదయం ఎప్పటిలాగే స్నానం చేసి బట్టలు వేసుకునేందుకు ఇంట్లోకి వెళ్లాడు.
ఎంతకూ బయటికి రాకపోవడంతో అతని తండ్రి సాలె యాదయ్య వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కింద పడి నోట్లో నుంచి నురగలు రావడం గమనించాడు. పక్కనే చూడగా పురుగులు మందు డబ్బా కనిపించింది. దీంతో మందు తాగాడని నిర్ధారించుకొని స్థానికుల సాయంతో వెంటనే మొయినాబాద్ మున్సిపల్(Moinabad Municipal) పరిధిలోని భాస్కర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం చనిపోయాడు. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు