21-09-2025 12:00:00 AM
-కొద్దిరోజులుగా ఆమెను హింసిస్తున్న వైనం
-భర్త వేధింపులతో సోదరి ఇంటికి వచ్చిన మంజుల
-కుషాయిగూడ ఏఎస్రావునగర్లో ఘటన
కాప్రా, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అనుపురంలో బోడ మంజుల (35) అనే మహిళను ఆమె భర్త బోడ శంకర్ (40) కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 20 ఏళ్ల క్రితం మంజులశంకర్ల వివాహం జరిగింది. జీవనోపాధి కోసం ముంబైకి వలస వెళ్లారు.
వారికి ఇద్దరు కొడుకులున్నారు. కాగా శంకర్ తన భార్యపై అనుమానం పెంచుకొని మానసికంగా, శారీరకంగ వేధింపులకు గురిచేసేవాడు. భర్త వేధింపులు భరించలేక మంజుల వారం రోజుల క్రితం తన అక్క రాణి ఇంటి వద్దకు ఏఎస్ రావు నగర్ లోని అనుపురానికి రాగా శంకర్ కూడా చిన్న కుమారుడితో అక్కడికి వచ్చాడు. శుక్రవారం పెద్దల సమక్షం లో భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చా రు.
అయితే అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో మంజులను శంకర్ కత్తితో విచక్షణారహితంగా నరికాడు.ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారే మేల్కొని అక్కడికి చేరుకునేలోపే శంకర్ పారిపోయాడు. దీంతో మంజుల అక్కడికక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శంకర్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపుని ప్రారంభించాయని పోలీసులు వెల్లడించారు.