calender_icon.png 2 November, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రియేటివిటీ హబ్‌గా హైదరాబాద్

02-11-2025 12:45:48 AM

‘ఇండియాజాయ్ 2025’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్ కేవలం ఐటీ రాజధానిగా మాత్రమే కాదు, భారతదేశపు ‘క్రియేటివిటీ హబ్’గానూ తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వం ‘కో క్రియేటర్’గా మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

రాష్ర్ట ప్రభుత్వం, తెలంగాణ వీఎఫ్‌ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ) ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని హెచ్‌ఐఐసీలో రెండు రోజుల పాటు ‘ఇండియాజాయ్ 2025’ పేరిట నిర్వహించనున్న ‘ఇండియాస్ ప్రీమియర్ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ కాంగ్రేషన్’ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సాంకేతికత, సృజనాత్మకత జంక్షన్‌గా హైదరాబాద్ పిక్సెల్, కవిత్వం, అవకాశాల నగరంగా ప్రపంచానికి మార్గ నిర్దేశం చేస్తుందని మంత్రి వివరించారు.

క్రియేటివ్ రంగానికి చేయూతనిచ్చేలా క్రియేటివ్ ఫ్యూచర్స్ ఫండ్, ఈస్పోర్ట్స్ అకాడమీ, మహిళా క్రియేటర్ల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సంబంధిత దిగ్గజ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 3.1 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ గేమింగ్ పరిశ్రమ విలువ 20 శాతం సీఏజీఆర్‌తో 2028 నాటికి 6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు.

భారతదేశ మొత్తం వీఎఫ్‌ఎక్స్ అవుట్ పుట్‌లో మన వాటా సుమారు 25 శాతం ఉండటం మనకు గర్వకారణమన్నారు. హైదరాబాద్ ఓటీటీ కంటెంట్ ప్రొడక్షన్ లో 35 శాతం వృద్ధి రేటు నమోదు కావడం ఇక్కడి ఎకో సిస్టంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ఇమేజ్ టవర్, ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ సిటీ తదితరాలు అందుబాటులోకి వస్తే ఈ ఎకో సిస్టం మరింత పటిష్టం అవుతుందన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇమేజ్ టవర్‌ను వచ్చే ఏడాదిలో అందుబాటులోకి తెస్తామన్నారు. క్రియేటివిటీలో సానుభూతి, వైవిధ్యం, సస్టునబులిటీ, భారతీయ గుర్తింపు ప్రతిబింబించేలా చొరవ తీసుకోవాలని యువ క్రియేటర్స్‌కు సూచించారు. రాష్ర్ట ప్రభుత్వం కో క్రియేటర్‌గా మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, యువ హీరో తేజ సజ్జా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, టీవీఏజీఏ ప్రెసిడెంట్ రాజీవ్ చిలక, కార్యదర్శి మాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.