మూసీలో పడిపోయిన మహిళను కాపాడిన హైడ్రా
హైదరాబాద్: గోల్నాక సమీపంలో మూసీలో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను హైడ్రా(HYDRAA) సిబ్బంది కాపాడారు. హైడ్రా అధికారులు మాట్లాడుతూ శనివారం ఉదయం 10.51 గంటలకు హైడ్రా కంట్రోల్ రూమ్(HYDRAA Control Room) కు ఫోన్ రాగా.. 11:07 గంటలకు హైడ్రా బృందాలు అక్కడకు చేరుకున్నాయి. అంబర్పేట్ సమీపంలోని గోల్నాక, భాగ్యనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇందిర (49) శుక్రవారం రాత్రి మూసీలో పడిపోయింది. ఆ సమీపంలో ఒడ్డుకు చేరే అవకాశం లేని చోట ఆమె మూసీలోకి జారి పడిపోయింది.
రాత్రంతా ఆమె మూసీలోనే భయం భయంగా గడిపింది. కేకలు వేసినా ఎవరికీ వినపడలేదు. శనివారం ఉదయం 10 గంటల తర్వాత స్థానికులు గుర్తించారు. బయటకు తీయడానికి అవకాశం లేకపోవడంతో హైడ్రా కంట్రోల్ రూమ్ నంబర్ 90001 13667 కు ఫోన్ చేసి స్థానికులు సమాచారం ఇచ్చారు. స్వామి (DRF రెస్క్యూ ఇంచార్జి) టీమ్ 16 అంబర్పేట్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
హైడ్రా సహాయక చర్యలు జరుగుతుండగానే ఫైర్ సిబ్బంది కూడా అక్కడకు చేరుకున్నారు. పెద్ద నిచ్చెన సహాయంతో డీఆర్ఎఫ్ బృందం(DRF Team) సభ్యులు కిందకు దిగి మూసీలో ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న మహిళను కాపాడారు. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులకు అప్పగించారు. పొరపాటున జారి పడిపోయినట్టు బాధితురాలు తెలిపింది. భర్త లేడని ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటున్నట్లు పేర్కొంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను హైడ్రా సిబ్బంది రక్షించిన తీరును స్థానికులు అభినందించారు.






