22-01-2026 01:08:42 AM
బంగ్లాకు ఐసీసీ 24 గంటల డెడ్లైన్
దుబాయి, జనవరి 21 : ఐసీసీ టీ20 వరల్ కప్లో బంగ్లాదేశ్ ఆడుతుందా? లేదా? అన్న అనుమానాలకు కొద్ది గంటల్లో తెరపడనుంది. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ మరో ఒక రోజు మాత్రమే గడువు ఇచ్చింది. బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ నుంచి శ్రీలంకకు మ్యాచ్లు తరలించేందుకు కుదరదని ఐసీసీ బంగ్లా క్రికెట్ బోర్డుకు తేల్చి చెప్పేసింది. ఒకవేళ బంగ్లాదేశ్ తన వైఖరి మార్చుకోకుండా భారత్లో ఆడేందుకు నిరాకరిస్తే, ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయ జట్టుగా ఎంపిక చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు మెజార్టీ డైరెక్టర్లు మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న 15 మంది డైరెక్టర్లలో పాకిస్తాన్ మాత్రమే బీసీబీకి మద్దతుగా నిలిచింది. సమావేశానికి ఐసీసీ చైర్మన్ జై షా సహా అన్ని ఫుల్ మెంబర్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
సమావేశం అనంతరం ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో భారతలో బంగ్లాదేశ్ జట్టుకు భద్రతాపరంగా ఎలాంటి ముప్పు లేదని నివేదిక స్పష్టం చేసిందని పేర్కొంది. ఆటగాళ్లు, అధికారులు, మీడియా ప్రతినిధులు, అభిమానులకు కూడా ఎటువంటి ప్రమాదం లేదని నివేదికలు వెల్లడించినట్టు తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీ ప్రారంభానికి ఇంత దగ్గరగా షెడ్యూల్ మార్చడం సాధ్యం కాదని ఐసీసీ స్పష్టం చేసింది. భద్రతా కారణాలు లేకుండా మ్యాచ్లను వేరే దేశానికి మార్చితే, భవిష్యత్తులో ఐసీసీ టోర్నీల నిర్వహణకు ఇబ్బందికరంగా మారుతుందని అభిప్రాయపడింది.
బీసీబీతో గత కొన్ని వారాలుగా విస్తృతంగా చర్చలు జరిపామని భద్రతా ప్రణాళికలు, ఆతిథ్య దేశ హామీలను పూర్తిగా వివరించినప్పటికీ బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని చెప్పుకొచ్చింది. బంగ్లాదేశ్ తమ గ్రూపును ఐర్లాండ్తో మార్చి శ్రీలంకలో మ్యాచ్లు ఆడే అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ప్రస్తుతం గ్రూప్ సీలో ఉన్న బంగ్లాదేశ్ ఫిబ్రవరి 7, 9, 14 తేదీల్లో కోల్కత్తా, ఫిబ్రవరి 17న ముంబైలో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీబీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే టీ20 వరల్ కప్లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు చోటు దక్కనుంది ఐసీసీ ఇచ్చిన చివరి గడువు తర్వాతే ఈ వివాదంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.