బీఆర్ఎస్ అప్పులు చేస్తే మా ప్రభుత్వం తీర్చుతోంది
పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 6.50 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 38వేల కోట్లు అప్పులు తీర్చడమే కాకుండా వడ్డీలు కూడా చెల్లిస్తున్నదని పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం తెలిపారు. ఐటీఐలకు పూర్వవైభవం తేవాలని చూస్తుంటే హరీశ్రావు విజ్ఞతలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గురువారం ఆయన గాంధీభవన్లో పార్టీ అధికార ప్రతినిధులు కాల్వ సుజాత, లింగంయాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని నేరాలు జరిగిన చర్యలు తీసుకోలేదని, తమ ప్రభుత్వం మాత్రం ఒక ఎస్ఐ తప్పు చేస్తే విధులు నుంచి తొలగించిందన్నారు. విద్యుత్ కొనుగోలుపై బీఆర్ఎస్ నేత విచారణకు హాజరుకావాలని పీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ చేసి 11 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మోడీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని లింగంయాదవ్ ఆరోపించారు. పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.






