కాంగ్రెస్‌ను గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం

21-04-2024 01:21:44 AM

l నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 

నిజామాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై కమిటీ వేశారని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బోధన్, బాల్కొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. బోధన్ నియోజవర్గంలోని ఎడపల్లి మండల కేంద్రంతో పాటు సాటాపూర్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తుందని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మోసపూరిత హామీలు ప్రజలు నమ్మవద్దని అన్నారు. కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.