18-09-2025 12:49:06 PM
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామ శివారు అసైన్డ్ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న భారీ నిర్మాణంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన తహశీల్దార్, పంచాయతీ అధికారులు చూసినట్టే వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని ఆపి వేయాలంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణేష్ కు వినతి పత్రం అందజేసి 10రోజులు దాటుతున్న ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోయారు. పంచాయతీ కార్యదర్శి కూడా దీనిపై పట్టించుకోవడం లేదని గ్రామస్థులు విమర్శించారు. అసైన్డ్ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపివేసి, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముప్పనపల్లి గ్రామస్థులు అధికారులను డిమాండ్ చేశారు.