గజ్వేల్లో మళ్లీ ‘డబుల్ ’ఇళ్ల లొల్లి
ఇళ్లు, పట్టాలు పంపిణీ చేయాలంటూ లబ్ధిదారుల ఆందోళన
నచ్చజెప్పిన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి
సమస్య పరిష్కరించకుంటే మళ్లీ ఆందోళనకు దిగుతామన్న లబ్ధిదారులు
గజ్వేల్, జూన్ 7: గజ్వేల్ మున్సిపాలిటీలో మళ్లీ డబుల్ బెడ్రూం ఇళ్ల లొల్లి మొదలైంది. ఇళ్లు, పట్టాలు పంపిణీ చేయాలంటూ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి లబ్ధిదారులు ఒక్కొక్కరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అరగంటలో అక్కడ సుమారు 500 మందికి పైగా చేరుకున్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి తమకు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇళ్లు ఇప్పిస్తామన్నారని, అందుకే తామంతా వచ్చామంటూ లబ్ధిదారులు పేర్కొన్నారు. అక్కడి నుంచి లబ్ధిదారులంతా కలిసి ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఇంటికి చేరుకోవడంతో.. ఆయన లబ్ధిదారుల వద్దకు వచ్చి వారి ఆవేదనను విన్నారు. ఓర్పుతో ఉండాలని, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించుకుందామని తెలిపారు. కాగా, తమ సమస్యకు పరిష్కారం దొరకకపోతే మళ్లీ మున్సిపల్ కార్యాలయం వద్దే బైఠాయిస్తామని లబ్ధిదారులు వెల్లడించారు.






