27-06-2025 01:30:28 AM
ఆదిలాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొం గిపొర్లుతున్నాయి. ఉమ్మడి జైనథ్ మండలంలోని తర్నం వాగు తాత్కాలిక వంతెనపై నుండి వరద నీరు ఉధృతిగా ప్రవహించడంతో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఆదిలాబాద్ రూరల్ మండలం నిషాన్ ఘాట్ వద్ద గల బండల వాగులో ఓ యువకుడు గల్లంతు అయిన ఘటన చోటుచేసుకుంది.
ఆదిలాబాద్కు చెందిన కొందరు యువకులు వాగులో చేపలు పట్టడానికి వెళ్లారు. వీరిలో శేఖర్ అనే యువకుడు చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో పడిపోయి గల్లంతయ్యా డు. తోటి మిత్రుడు అతడిని రక్షించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. వెం టనే విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పరవళ్లు తొక్కుతున్న కుంటాల
ఆదిలాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం తోపాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. భారీ వర్షానికి రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతం కుంటాలకు భారీ వరద వచ్చి చేరింది. ఎత్తయిన కొండలపై నుంచి జాలువారుతున్న వరదనీటి తో జలపాతం కనువిందు చేస్తోంది.