27-06-2025 01:32:38 AM
ఆదిలాబాద్, జూన్ 26 (విజయక్రాంతి) :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లాలో తొలిసారిగా సుడిగాలి పర్యటన చేశారు.గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొమురంభీం, మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాగా గాంధీ పార్క్లో మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసిన అనంతరం మీడియాలో మాట్లాడుతుండగా పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి కింద పడటంతో మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. దీంతో మంత్రులు మీడియాతో మాట్లాడుతుండగానే అర్దాంతరంగా వెళ్లిపోయారు. చెట్టుకొమ్మ విరిగిపడిన స్థలంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా అధికారుల, ప్రజా ప్రతినిధుల సమావేశం లో మంత్రులు పాల్గొన్నారు.
సమావేశ మందిరంలోని స్టేజీపై కూర్చోడానికి అనువుగా లేకపోవడంతో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కిందికి వచ్చి జనం మధ్యలో కూర్చున్నారు. దీంతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి లు వారి వద్దకు వచ్చి స్టేజీపైకి రావాలని విన్నవించారు. దింతో కొద్దీ సేపు సమావేశం లో అంతరాయం నెలకొంది. వెంటనే స్టేజి పై నుండి మంత్రి జూపల్లి సైతం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను స్టేజి పైకి రావాలని కోరడంతో తర్వాత వారు స్టేజీపైకి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రస్తావించిన జిల్లాకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరిచేందుకు కృషి చేస్తామని మంత్రులు భరోసా ఇచ్చా రు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ...ప్రజాపాలనలో పారదర్శకతకు అధి క ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని, ప్రతి లబ్ధిదారుడికి నిర్ణీ త గడువులోగా అందించినప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు. పథకాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. మహాలక్ష్మీ, గృహజ్యోతి వంటి పథకాలు సక్రమంగా అమలవుతున్నా రూ.500లకే వంట గ్యాస్ పథకం ఇంకా పూర్తి స్థాయిలో అర్హులకు చేరడం లేదని తెలిపారు.
గ్రామ సభలు, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకున్నా, పొరపాటు ఎక్కడ జరిగిందో అధికారులు సమీక్ష నిర్వహించి ప్రతి ఒక్కరికి అందించేలా కృషి చేయాలని సూచించారు. గతంలో ధరణి ఉన్న సమయంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చిన తర్వాత పరిష్కరించే బాధ్యతను అధికారులకు అప్పగించామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు పెడుతున్నా సంక్షేమ పథకాలు, అభివద్ధి పనులు మాత్రం ఆపడం లేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు ప్రతి నెలా రూ.6500కోట్లు వడ్డీలు కడుతున్నామని వివరించారు.
ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోంది: మంత్రి వివేక్
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పట్టుదలతో పని చేస్తోందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా జూపల్లి కష్ణారావు రావడం జిల్లా ప్రజల అదృష్టమని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గ్యారెంటీ పథకాలు అమ లు చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.200కోట్లతో 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ తో పాటు ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నా రు. ప్రభుత్వం విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు గోడం నగేష్, గడ్డం వంశీ, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మబొజ్జు పటేల్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, కోవ లక్ష్మీ, పాల్వాయి హరీష్ బాబు, గడ్డం వినోద్, ఆయా జిల్లాల కలెక్టర్లు రాజర్షిషా, అభిలాష అభినవ్, వెంకటేష్ దోత్రె, కుమార్ దీపక్, ఎస్పీలు అఖిల్ మహాజన్, జానకి షర్మిల, క్రాంతిలాల్ పాటిల్, ఐటీడీఏ పీఓ ఖుష్బుగుప్తా, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.