9 July, 2026 | 9:48 PM

దేశంలోకి రికార్డు రెమిటెన్సులు

09-05-2024 12:31 AM

100 బిలియన్ డాలర్లు దాటిన ప్రవాసుల నిధులు

న్యూఢిల్లీ, మే 8: ప్రవాస భారతీయులు దేశంలోకి పంపుతున్న సొమ్ము రికార్డుస్థాయికి చేరింది. భారత్‌లోకి తరలివచ్చిన రెమి టెన్సులు తొలిసారిగా 100 బిలియన్ డాల ర్ల స్థాయిని అధిగమించినట్టు యునైటెడ్ నేషన్స్ మైగ్రేషన్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) విడుదల చేసిన రిపోర్ట్ తెలిపింది. 2022లో ఇవి 111 బిలియన్ డాలర్లకుపైగా ఉన్నాయన్నది. ప్రపంచంలో ఏ ఇతర దేశాలకన్నా భారత్‌లో కి తరలివచ్చిన రెమిటెన్సులే అధికం. రెమిటెన్సులు అధికంగా అందుకున్న దేశాల్లో భార త్ తర్వాతిస్థానాల్లో మెక్సికో, చైనా, ఫిలిప్పీ న్స్, ఫ్రాన్స్‌లు ఉన్నాయి.  భారత్‌లోకి రెమిటెన్సుల ప్రవాహం క్రమేపీ పెరుగుతున్నదని ఐఓఎం నివేదిక తెలిపింది. 2010లో భారత్‌లోకి 53.48 బిలియన్ డాలర్ల రెమిటెన్సు లు రాగా, 2015లో అవి 68.91 బిలియన్ డాలర్లకు, 2020లో 83.15 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2022లో 111.22 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇతర దేశాలకు వలస వెళుతున్న కార్మికులు, ఉద్యోగుల్లో దక్షిణాసియా దేశాల నుంచి అధికమని, అందుచేత అంతర్జాతీయ రెమిటెన్సులు పొందుతున్న టాప్ దేశాల్లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయన్నది. 

1.8 కోట్ల మంది విదేశాలకు వలస

మైగ్రేషన్ ట్రెండ్స్‌ను ఐఓఎం రిపోర్ట్ వివరిస్తూ భారత జనాభాలో 1.3 శాతం (1.8 కోట్లు) విదేశాలకు వలస వెళ్లారని, ఇందులో ఎక్కువమంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియాల్లో ఉన్నారని వెల్లడించింది. అలాగే 44.8 లక్షల మంది ఇతర దేశాల నుంచి వచ్చి భారత్‌లో నివసిస్తున్నారని పేర్కొంది. 

రెమిటెన్సులు అందుకుంటున్న టాప్ 10 దేశాలు

దేశం         రెమిటెన్సులు (బిలియన్ డాలర్లలో)

ఇండియా                       111.22

మెక్సికో                        61.10

చైనా                        51.00

ఫిలిప్పీన్స్               38.05

ఫ్రాన్స్                       30.04

పాకిస్థాన్                       29.87

ఈజిప్ట్                       28.33

బంగ్లాదేశ్                       21.50

నైజీరియా               20.13

జర్మనీ                      19.29